తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
ఆదిలాబాద్,అక్టోబర్29(జనంసాక్షి): తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేతలను ప్రజలు నమ్మవద్దని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ కోరారు. తనను టార్గెట్ చేసుకుని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ రమేశ్ చేస్తున్న దుష్పచ్రారం చేస్తున్న ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. సుధీర్ఘ కాలంగా నియోజకవర్గం లో అధికారంలో ఉన్న వారు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. ఆలోచించి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, అభివృద్ధి చేయకుండా మోసపు మాటలతో వచ్చే వారికి తగిన గుణపాఠం చెప్పాలని రేఖానాయక్ కోరారు. అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాఉల చేపట్టారని తాజా అన్నారు. శాసన సభ్యురాలిగా తాను కేవలం 4 సంవత్సరాల కాలంలో రూ. 520 కోట్లతో సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం, రూ. 20 కోట్లతో సదర్మాట్ ప్రధాన కాలువకు లైనింగ్ చేయించినట్లు తెలిపారు. రూ. 34 కోట్లతో సరస్వతీ కాలువ డిస్టిబ్యూట్రర్ల లైనింగ్, రూ.రెండు కోట్లతో ఖానాపూర్ – బెల్లాల్ బీటీ రెన్యూవల్, ఖానాపూర్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, రూ.మూడు కోట్లతో రైతుల కోసం గోదాములు నిర్మించామని చెప్పారు.విద్యాభివృద్ధి కోసం ఖానాపూర్, ఉట్నూర్లో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ బాలికల గురుకులాల ఏర్పాటు, రూ. 2.5 కోట్లతో యువతకు క్రీడల కోసం స్టేడియం నిర్మాణం, ప్రజల సౌకర్యం ఖానాపూర్ జీపీని మున్సిపాలిటీ ఏర్పాటు, దాని అభివృద్ధి కోసం రూ. 20 కోట్ల మంజూరు చేయించామని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో 6,268 మంది ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు.