తమిళనాడులో ఓటింగ్‌ సమయం పెంపు

చెన్నై: తమిళనాడులో వర్షాల కారణంగా ఎనిమిది జిల్లాల్లో పోలింగ్‌ సమయాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తిరుచ్చి, మధురై, శివగంగ, దిండిగల్‌ సహా పలు జిల్లాల్లో వర్షం కారణంగా పోలింగ్‌ సమయాన్ని రాత్రి 7గంటల వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 58.28 శాతం పోలింగ్‌ నమోదైంది.తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు గాను 232 స్థానాల్లో సోమవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అరవకురిచ్చి, తంజావూరు స్థానాల్లో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభపెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రెండు స్థానాల్లో ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది.