తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమె మరో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మద్రాస్ యూనివర్శిటీ సెంటినరీ సమావేశ మందిరంలో రాష్ట్ర గవర్నర్ రోశయ్య… జయలలితతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మద్రాస్ యూనివర్శిటీ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటుచేశారు. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఇది ఆరోసారి. ఎంజీఆర్ తర్వాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతగా ఆమె రికార్డు సృష్టించారు.
జయలలితతో పాటు 29 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో మాదిరిగానే మంత్రులందరూ సామూహికంగా ప్రమాణం చేశారు. జయ కేబినెట్లో ఈసారి 13 మంది కొత్తవారికి అవకాశం దక్కింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
హాజరైన ప్రముఖులు
జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, కరుణానిధి తనయుడు స్టాలిన్, సినీనటుడు శరత్కుమార్ తదితరులు హాజరయ్యారు.