తల్లి పీక కోసిన కొడుకు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాజాపూర్‌లో ఓ దారుణం జరిగింది. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్‌కు ముందు మేక పీకను ఎందుకురా కోశావు అని అడిగినందుకు ఓ యువకుడు తల్లి పీక కోసి కటకటాలపాలయ్యాడు. గురువారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే.షాజాపూర్‌కు చెందిన ఇర్షాద్ అనే యువకుడు బక్రీద్ పండుగకు ముందురోజు తన ఇంటి వెలుపల మేకను కట్టేసివున్న దాని తల కోశాడు. దీన్ని గమనించిన అతని తల్లి ‘పండుగ రేపు కదా, ఇవాళే ఎందుకు కోశావంటూ’ అని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు… మేక పీకను తెగ్గోసిన కత్తితోనే కన్నతల్లి పీక కోశాడు.తీవ్ర రక్తస్రావమైన ఆ తల్లి అక్కడే ప్రాణాలు విడిచింది. తల్లి చనిపోయిందని గమనించిన ఇర్షాద్ అక్కడ నుంచి పారిపోయాడు. జరిగిన దారుణాన్ని ఇరుగుపొరుగువారు పోలీసులకు చేరవేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పరారైన ఇర్షాద్‌ను టంకీ చౌరాహా అనే ప్రాంతంలో అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.