తాగి, పోలీసును పట్టుకు కొట్టాడు..!
, హైదరాబాద్: ఓ రిక్షా కార్మికుడు పీకల దాకా తాగి డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ను చితకబాదాడు. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక మధు విహార్ ప్రాంతంలో మద్యం తాగి వున్న ఓ రిక్షా కార్మికుడు మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా అది చూసిన కానిస్టేబుల్ అతన్ని అడ్డుకోవడానికి యత్నించాడు. ఆగ్రహించిన రిక్షా కార్మికుడు కానిస్టేబుల్ని అవతలికి తోసేయడమే కాక ఇష్టం వచ్చినట్లు కొట్టాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసుపై చేయిచేసుకోవడంతో అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.