తాలిబన్లను తుదముట్టించే ప్రయత్నంలో ట్రంప్‌

కాబూల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఆల్‌ఖైదాను తుదముట్టించడంతో పాటు దాని అధినేత బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టిన అమెరికా సిఎఐ ఇప్పుడు తాలిబన్లను తుదముట్టించే ప్రయత్నంలో పడింది. ఇటీవల వరుసగా జరుగుతున్న దాడుఉల ఇందులో భాగమని తెలుస్తోంది. అప్గనిస్థాన్‌పై అమెరికా విధానాన్ని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశ సైన్యానికి, ప్రభుత్వానికి అమెరికా సహకరిస్తుందని పేర్కొన్నారు. దీంతో పాటు మరో 4,000 మంది సైనిక సిబ్బందిని అక్కడకు తరలించేం దుకు ఆమోదముద్ర కూడా వేశారు. దీనికి అనుగుణంగానే సీఐఏ ఆప్గన్‌ సైన్యంతో సమాచారాన్ని పంచుకుం టోంది. దీనిలో భాగంగానే పాక్‌-అప్గన్‌ సరిహద్దుల్లో తాలిబన్లపై డ్రోన్లతో దాడులు చేశాయి. దీంతో అప్గనిస్థాన్‌లో అమెరికా ప్రాధాన్యాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు అల్‌ఖైదా ఉగ్రవాదులపై పోరాడిన అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఈ సారి తాలిబన్లపై దృష్టిపెట్టింది. ఇటీవల అఫ్గాన్‌లో అమెరికా లక్ష్యంగా తాలిబన్లు తరచూ దాడులు చేస్తున్నారు. దీనికి తోడు తాలిబన్లు అప్గనిస్థాన్‌లో చాలా భాగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటున్నారు. ఈ దాడులతో అప్రమత్తమైన సీఐఏ (సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ) అప్గనిస్థాన్‌ ఇంటిలిజెన్స్‌ సంస్థకు సహకారం అందిస్తోంది. ఫలితంగా అప్గన్‌ సైన్యం తాలిబన్లపై దాడులను పెంచింది.

హస్య ఆపరేషన్లు.. మెరికల్లాంటి అధికారులు, కాంట్రాక్టర్లను సీఐఏ అప్గనిస్థాన్‌కు తరలించింది. అక్కడ చేపట్టే రహస్య ఆపరేషన్లను కూడా విస్తరిస్తోంది. తాలిబన్లలో బాంబుల తయారీదార్లను గుర్తించి హతమార్చడమే లక్ష్యంగా చిన్నచిన్న బృందాలను సిద్ధం చేసింది. ఈ బృందాలు రాత్రివేళల్లో దాడులు నిర్వహిస్తుంటాయి. ట్రంప్‌ వ్యూహానికి అనుగుణంగా వీరు ఆపరేషన్లు చేపట్టనున్నారు.