తుపాన్లు వస్తే పచ్చ చొక్కాలకు పండగే!.

– చంద్రబాబు కోట్ల విలువైన పనులు పంచేవాళ్లు
– మూడు రోజులు అధికార యంత్రాంగం అవిశ్రాంతంగా కష్టపడింది
– ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి, మే3(జ‌నంసాక్షి) : ప్రతిరోజూ ఏదోఒక అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ శ్రేణులుపై విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు గుప్పించారు. తాజాగా శుక్రవారం ‘ఫొని’ తుపాను నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తుపాన్లు వచ్చినప్పుడల్లా చంద్రబాబునాయుడు టీడీపీ నేతలకు విలువైన పనులను నామినేషన్‌ విూద ఇచ్చేసేవాళ్లని, ఆ విధంగా తనవారికి ప్రజధనాన్ని పంచిపెట్టేవారని ఆరోపించారు. తుపాన్లు వచ్చిన సమయాల్లో పంచిపెట్టిన పనుల విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని ట్వీట్‌ చేశారు. ఈసారి అధికార యంత్రాంగం తుపాను సహాయక చర్యల్లో ఎంతో కష్టపడిందని, ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని విజయసాయి కితాబిచ్చారు. ఎలాంటి ప్రచారం కోరుకోకుండా మూడు రోజుల పాటు అవిశ్రాంతంగా సహాయక చర్యలు చేపట్టారని అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఫణి తుపాను తీరం దాటిన నేపథ్యంలో కలెక్టర్లు పారదర్శకంగా నడుచుకోవాలని సూచించారు. అంతేగాకుండా ఓటమి ఖాయమై పదవిలోంచి దిగిపోయే ముందు పదవికి అతిగా ఆశలు పెట్టుకున్న నాయకుడు, కోడ్‌ అమలులో ఉండగా సీఎస్‌ తో పెట్టుకున్నవాళ్లు మంచి పేరు తెచ్చుకున్నట్టు చరిత్రలో ఎక్కడా లేదని సినీ ఫక్కీలో విజయసాయి మరో ట్వీట్‌ చేశారు.