తెరాసతోనే సింగరేణి మనుగడ
దీనిని అభివృద్ది చేసిన ఘనత కెసిఆర్దే: బాల్క సుమన్
మందమర్రి,నవంబర్19(జనంసాక్షి): తెరాస ప్రభుత్వం ఏర్పాటుతోనే సింగరేణి మనుగడ మరింత మెరుగవుతుందని చెన్నూరు టిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పేర్కొన్నారు. సింగరేణిని ఆదరించి అభివృద్ది చేసిన ఘనత సిఎం కెసిఆర్దన్నారు. సోమవారం మందమర్రి ఏరియా కేకే5 గనిపై ఆయన ప్రచారం నిర్వహించారు. కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులంటే కేసీఆర్కు ప్రత్యేక అభిమానం అని కొనియాడారు. అందులో భాగంగా వారసత్వ ఉద్యోగాలకు పేరు మార్చి కారుణ్య నియమకాల పేరిట ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కార్మికుల ఆకాంక్షను గుర్తించి 27శాతం లాభాల వాటాను పెంచారని, ఇల్లు నిర్మాణం కోసం రూ.10 లక్షలు వడ్డీలేని రుణం, అంబేడ్కర్ జయంతి రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సింగరేణి కార్మికుల ఆదాయపన్ను రద్దు విషయాన్ని తాను పార్లమెంట్లో మాట్లాడినట్లు చెప్పారు. తెరాసకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో దిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, తెబొగకాసం ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, జె రవీందర్, ఓ.రాజశేఖర్, వజీర్ సుల్తాన్, లక్ష్మణ్. బాబురావు, మద్ది శంకర్, ఎండీ అబ్బాస్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగుంటపల్లిలో భాజపా ప్రచారం
భాజపా నియోజకవర్గ అధ్యక్షుడు అందుగుల శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి మాలశ్రీ మందమర్రి పట్ణణం ఎర్రగుంటపల్లి గ్రామంలో సోమవారం ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు వివరించారు. భాజపా అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.