తెలంగాణలో అణచివేతపై అమిత్‌షాకు వివరించాం

కెసిఆర్‌ కుటుంబ పాలన,నియంతృత్వ పాలనపై విరించాం
అమిత్‌షాతో భేటీపై బండి సంజయ్‌ వివరణ
న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణలోని పరిస్థితులు, అణిచివేత, పాదయాత్ర, కేసుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారులను అణిచివేస్తుందన్నారు. ఈటల రాజేందర్‌ భారీ మెజార్టీతో గెలుపొందడాన్ని అమిత్‌షా అభినందించారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ లో మా పోరాటంపై అమిత్‌ షా సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలన, అవినీతి, కుటుంబ పాలనపై పోరాటాన్ని అభినందించారు. ఇదే పంథాను కొనసాగించాలని, అవినీతిపై పోరాడాలని సూచించారని అన్నారు. తెలంగాణలో మరింత ముందుకు పోవాలన్నారు.ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత వెంటనే ప్రారంభించాలని చెప్పారు. రెండు రోజుల పాటు యాత్రలో పాల్గొంటానని అమిత్‌షా హావిూ ఇచ్చారు.వరి విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దుర్మార్గుడు, తెలంగాణలో సమస్యలను సృష్టించే పార్టీ టీఆర్‌ఎస్‌. జోనల్‌ వ్యవస్థతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వరిధాన్యం కొనే దమ్ము కేసీఆర్‌కి లేదు. పక్క రాష్టాల్ల్రో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుంది. కేసీఆర్‌ రాష్ట్రంలో ఎవరికి అపాయింట్మెంట్‌ ఇవ్వడం లేదు. ప్రతి గింజ కొంటామని కేసీఆర్‌ మోసం చేశారు. కేసీఆర్‌ అవినీతిపై పోరాటం చేస్తామని బండి సంజయ్‌ తెలిపారు.