తెలంగాణ ప్రాజెక్టులపై కనికరించండి

నితిన్‌ గడ్కరీతో హరీష్‌ రావు భేటీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్‌ గడ్కరీని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ జితేందర్‌ రెడ్డి గురువారం కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాల వివరాలను మంత్రి హరీశ్‌రావు కేంద్రమంత్రి గడ్కరీకి వివరించారు. రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల మంజూరులో చొరవ చూపాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. జడ్చర్ల-మహబూబ్‌నగర్‌ నాలుగు లేన్‌ రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ జితేందర్‌ రెడ్డి గడ్కరీని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన గడ్కరీ..త్వరలోనే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.