తెలంగాణ రహదారుల నిర్మాణానికి 41వేల కోట్లు
– కేంద్ర మంత్రి గడ్కరీ
హైదరాబాద్,జనవరి 4(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ. 41 వేల కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పర్యటన నిమిత్తం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్కు చేరుకున్నారు. అనంతరం ఆయన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలకు 16 వేల కోట్లు రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. హైదరాబాద్లో జలరవాణా వ్యవస్థకు నావిగేషన్ రిపోర్టు ఇవ్వమని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఈ జలరవాణా వ్యవస్థ ద్వారా నేషనల్ హైవే, ఎయిర్ వే, రైల్వే కనెక్టివిటీల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని గడ్కారీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సానుకూలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర జాతీయ రోడ్ల అభివృద్ధి కోసం రూ.41 వేల కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న అన్ని సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రూ.40,800కోట్లతో 2500 కిలోవిూటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
రహదారులకు కేంద్రం అధిక ప్రాధాన్యం: గడ్కరీ
కేంద్రంతో కలసి పనిచేస్తామన్న కెసిఆర్
రహదారుల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రహదారుల అభివృద్దికి అధికా ప్రాధానం ఇస్తున్నామని అన్నారు. వరంగల్ జిల్లాలోని మడికొండలో 163వ జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆయన సీఎం కేసీఆర్తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఏటూరు నాగారం-వంతెనను జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్ కోరిక మేరకు తెలంగాణకు జాతీయ రహదారులు మంజూరు చేశామన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు రూ.16 వేల 5 వందల కోట్లు కేటాయించామన్నారు.
బెంగళూరు-హైదరాబాద్ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి అనుమతి ఇస్తున్నామన్నారు. భద్రాచలం-కౌటాల వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి జలమార్గ ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తామన్నారు. తెలంగాణ పూర్తిస్థాయి అభివృద్దికి కేంద్రం సహకరిస్తుందని హావిూ ఇచ్చారు.
మడికొండలో 163వ జాతీయ రహదారి నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వేదికపై ఇరువురు కలిసి జ్యోతి ప్రజల్వన చేసి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్మాట్లాడుతూ అభివీద్ది పనుల్లో కేంద్రం తో కలిసి పనిచేస్తామని చెప్పారు. .కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సమక్షంలో ఆయన మాట్లాడుతూ టీమ్ ఇండియాలో తెలంగాణ కూడా భాగస్వామి, అని అబివృద్ది విషయంలో కేంద్రంతో కలిసి ఉంటామని ఆయన అన్నారు. నితిన్ గడ్కరి గొప్ప అనుభవం కలిగిన నేత అని, మహారాష్ట్రలో ఎక్స్ ప్రెస్ హై వే ని ప్లాన్ చేసి పూర్తి చేసిన ఘనత గడ్కరిదేనని ఆయన అన్నారు. గోదావరి నది లో వాటర్ వేస్ అభివృద్ది తదితర అంశాలలో తెలంగాణకు సాయం చేయాలని కెసిఆర్ కోరారు.తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని ,కేంద్రం పూర్తిగా మద్దతు ఇవ్వాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.కాగా కెసిఆర్ తన ప్రసంగం పూర్తి చేసి కేంద్ర మంత్రికి జ్ఞపికను అందచేస్తున్న సందర్భంలో జనగణమన పాట ను ఆరంభించారు. కేంద్ర మంత్రి,కెసిఆర్ అటెన్షన్ లో లేకపోవడం తో ఆపి ,వారు అటెన్షన్ లోకి రాగానే మళ్లీ జాతీయ గీతాలాపన చేశారు.
వరంగల్లో టెక్స్టైల్ పార్క్: కెసిఆర్
వరంగల్-యాదగిరిగుట్ట నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి మడికొండలో కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఉత్తమమైన టెక్స్టైల్ పార్క్ను వరంగల్లో ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దేశంలో తొలి ఎక్స్ప్రెస్వే నిర్మించిన ఘనత గడ్కరీదేనని కేసీఆర్ అన్నారు. 1800 కి.విూల హైవేలు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడుస్తామని చెప్పారు. ఆదరించిన వారిని పూజిస్తామని, వ్యతిరేకించిన వారితో లడాయి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారులను మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకుంటారని సీఎం అన్నారు. 163వ జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఏటూరు నాగారం-వంతెనను జాతికి అంకితం చేశారు. గడ్కరీ రాష్ట్రానికి 18 వందల కిలోవిూటర్ల రోడ్లను మంజూరు చేశారని అన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో వరంగల్ రెండో అతిపెద్ద నగరమని పేర్కొన్నారు. వరంగల్కు సైనిక్ స్కూల్ వచ్చిందని అన్నారు. వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను త్వరగా పునఃప్రారంభించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మరిన్ని రైల్వే బ్రిడ్జిలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.