తెలంగాణ వచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదు
వాటి పరిష్కారానికి పోరాడుతాం
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలి
అమరులకు నివాళులర్పిద్దాం
టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, మే19(జనంసాక్షి) : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదంరామ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. టీజేఏసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాపోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని, ఆ విషయాన్ని మర్చిపోద్దని చెప్పారు. ఓయూ (ఉస్మానియా యూనివర్శిటీ) భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటనపై జేఏసీ కూడా దృష్టి పెట్టింది. ఈ అంశంపై సిటీ జేఏసీతో చర్చిస్తామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఓయూలో ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు విద్యార్థులు సెక్రటేరియట్ను ముట్టడించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు అరస్టయిన విషయం కూడా తెలిసిందే. జూన్ 2న జరగనున్న కార్యక్రమాలపై… పలు అంశాలపై కూడా టీ-జేఏసీ చర్చలు జరిపింది. నివేదికలు వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేస్తామని కోదండరాం తెలిపారు. సీమాంధ్ర పాలకులు విధ్వంసం చేసిన తెలంగాణను సామాజిక న్యాయం పునాదిగా నిర్మించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.