తొలి దశలో 9 రాష్ర్టాలు ఎంపిక

87h6rm6aపట్టణాల్లో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి తొలిదశలో తెలంగాణ సహా 9రాష్ట్రాలు ఎంపికయ్యాయి. మన రాష్ట్రంలో 34నగరాలు,పట్టణాల్లో మొదటిదశలో ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నారు. కేంద్ర,రాష్ట్రాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి.
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి తొలి దశలో తెలంగాణ సహా 9 రాష్ర్టాలను ఎంపికచేశారు. ఈ రాష్ర్టాల్లోని 305 నగరాలు, పట్టణాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తారు. మన రాష్ట్రంలోని 34 నగరాలు, పట్టణాల్లో పేదలకు ఇండ్లు కట్టివ్వనున్నారు. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా అమలుచేసే ఈ పథకానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులు ప్రకటించారు.
ఈ పథకం కింద కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1లక్ష నుంచి రూ.2.30 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తుంది. తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు రెండు పడక గదుల ఇండ్లను నిర్మించడానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే కసరత్తుప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర పథకం కూడా రాష్ట్ర పథకంతో కలిసి అమలు కానుంది. రాష్ట్రం నుంచి ఇప్పటికే రెండు స్మార్ట్ సిటీలు, 11 అమృత్ నగరాలుగా ఎంపికైన విషయం తెలిసిందే. అందరికీ ఇండ్లు పథకం కూడా వీటితో పాటే అమలు కానుంది. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఏకకాలంలో స్మార్ట్ సిటీ, అమృత్, అందరికీ ఇండ్లు పథకాలు అమలవుతాయి. మిగిలిన ఎనిమిది అమృత్ నగరాల్లో ఆ పథకంతోపాటు అందరికీ ఇండ్లు పథకం అమలవుతుంది. సిద్దిపేట విషయంలో కేంద్రం నుంచి ఇంకా అమృత్ ప్రకటన అధికారికంగా వెలువడనందున ప్రస్తుతానికి రాష్ట్రంలో పది అమృత్ నగరాలు మాత్రమే మంజూరైనట్లు భావించాల్సి ఉంటుంది. హైదరాబాద్, వరంగల్‌లతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మిర్యాలగూడ, నల్లగొండ, మహబూబాబాద్, నిజామాబాద్, సూర్యాపేటలు అమృత్ నగరాలుగా ఎంపికయ్యాయి.
అందరికీ ఇండ్ల పథకాన్ని అమలుచేసేందుకు కేంద్రంతో 15 రాష్ర్టాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన ఆరు సంస్కరణలను అమలుచేసేందుకు ఈ రాష్ర్టాలు అంగీకరించాయి. వీటిలో మొదటగా 9 రాష్ర్టాల్లో పథకం అమలుకోసం పట్టణాలు, నగరాలను ఎంపికచేశారు. తెలంగాణలో 34 నగరాలు,పట్టణాల్లో మొదటిదశలో ఇండ్లు నిర్మిస్తారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, కరీంనగర్, జమ్మికుంట, మెట్‌పల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వరంగల్, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, పాల్వంచ, నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట, మెదక్, జహీరాబాద్, సిద్దిపేట, వికారాబాద్, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, షాద్‌నగర్, అచ్చంపేట, కొల్లాపూర్‌ వీటిలో ఉన్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022వ సంవత్సరం నాటికి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటికల్లా దేశంలోని పట్టణ పేదలకు రెండు కోట్ల ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేయనున్నారు. అయితే, కేంద్రం నిర్దేశించిన ఆరు సంస్కరణలను అమలుచేస్తేనే ఇండ్ల నిర్మాణానికి నిధులు ఇస్తుంది. పథకం కింద ఎంపికైన పట్టణాల్లో నివాస ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించేటప్పుడు ఏ విధమైన సాగుభూములు లేకపోతే వెంటనే అమలు చేస్తుంది. పథకం అమలుకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించడం, ఇండ్ల నిర్మాణానికి అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో విధానంతో సత్వరం మంజూరు చేస్తుంది. ఆర్థికంగా బలహీనవర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలకు ఇండ్లను నిర్మించడంలో అనుమతులకు ప్రాధాన్యం ఇస్తారు. అవసరమైతే అద్దె చట్టాలకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇప్పటికే సూచించిన విధంగా సవరణలు చేస్తారు. మురికివాడల అభివృద్ధి, తక్కువ ఖర్చుతో నిర్మించే ఇండ్ల విషయంలో అవసరాన్ని బట్టి నిర్మాణ విస్తీర్ణాన్ని పెంచడం అనే నిబంధనలను కేంద్రం విధించింది