థానే రైల్వేస్టేషన్‌లో గర్భిణీ ప్రసవించిన వేళ….

ముంబై : ముంబై నగరం పరిధిలోని థానే రైల్వేస్టేషనులో ఓ గర్భిణీ పురిటి నొప్పులతో ప్లాట్ ఫాంపైనే ప్రసవించిన ఘటన జరిగింది. బద్లాపూర్ లోని షానీనగర్ కు చెందిన జాన్వీ జాదవ్ అనే 25 ఏళ్ల మహిళ నిండు గర్భిణి. జాన్వీకి పురిటి నొప్పులు రావడంతో పొరుగింటి వారు ఆమెను వాషిలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు థానే రైల్వేస్టేషనుకు తీసుకువచ్చారు. లోకల్ రైలు కోసం పదో నంబరు ప్లాట్ ఫాంపై వేచి ఉండగా నొప్పులు అధికమయ్యాయి. అంతే రైల్వేస్టేషనులో విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ తోపాటు మహిళా ప్రయాణికులు గర్భిణీని చుట్టుముట్టి సుఖ ప్రసవమయ్యేలా సహకరించారు. దీంతో జాన్వీ రైల్వే ప్లాట్ ఫాంపైనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ప్రభుత్వ రైల్వే పోలీసులు క్షేమంగా ఉన్న తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించారు.