దక్షిణ ఢిల్లీలో లక్ష ఓట్లు గల్లంతు

కారణం బిజెపి అన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): భారతీయ జనతాపార్టీపై ఆమ్‌ఆద్మీపార్టీ విమర్శలు గుప్పించింది. బీజేపీ వల్లనే దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో లక్ష మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది. గత ఏడాది కాలంలో నియోజకవర్గ పరిధిలో లక్ష మంది పేర్లు తారుమారు చేశారని దక్షిణ ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గ ఆప్‌ ఇన్‌ఛార్జి రాఘవ్‌ చధా ఆరోపించారు. దక్షిణ ఢిల్లీ పరిధిలోని ఛత్తార్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 7500, బిజ్వాసన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 12000, తుగ్లకాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 6000 పేర్లు తొలగించినట్లు తెలిపారు. ఏడాదిన్నర కాలంలో మొత్తం 10 నియోజకవర్గాల నుంచి లక్ష ఓటర్ల పేర్లు తొలగించారన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదని బీజేపీ ఇన్నాళ్లకు తెలుసుకుందని, అందుకే ఓటర్ల జాబితాలో నుంచి పేర్లను తొలగించిందని రాఘవ్‌ చదా విమర్శించారు. మరోవైపు ఈ అంశంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అబద్దాలు మాట్లాడుతుందని ఢిల్లీ బీజేపీ జనరల్‌ సెక్రటరీ రవిందర్‌గుప్తా ఆరోపించారు.