దశాబ్దాలుగా పోలవరం నిర్మాణ పనులు

నిర్వాసితులకు పరిహారంలో నిర్లక్ష్యం
వరదలు ముంచెత్తినా పట్టించుకోని పాలకులు

ఏలూరు,జూలై29(జనంసాక్షి ):దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనేక పార్టీలకు ఎన్నికల హావిూగా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా 2019 నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. కానీ దానికి తగ్గట్టుగా పనులు చేయలేకపోయింది. మూడేళ్లు దాటిన వైసిపి ప్రభుత్వం కూడా హావిూని నిలబెట్టుకోలేదు. 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని చెప్పినా నెరవేరలేదు. కానీ ఇప్పుడు దానిని మరో ఏడాదికి పొడిగించింది. ఓ దశలో ఎప్పటికిపూర్తవుతుందో అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే పునరావాస ప్యాకేజీ పెద్ద సమస్యగా మారింది. వీరికి పరిహారం ఇస్తే ఖాళీ చేయడానికి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సిద్దంగా ఉన్నారు. ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయకూడదని ఎ.పి హైకోర్టు కూడా ఆదేశించింది. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పెద్ద ప్రహసనంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి యత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలదీసి, నిధులు రాబట్టడంలో విఫలమవుతోంది. బాధితులు మాత్రం నిలువు నీళ్లలో, ఇప్పుడు వరదల సమయంలో చీకట్లో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సంగతి ఆ తర్వాత ప్రస్తుతం వరదల సమయంలో సహాయక చర్యలు చేపడదామనే ఆలోచన కూడా ప్రభుత్వాలకు రావడం లేదు. దీంతో మూడేళ్లుగా కొద్దిపాటి వరదలకే ఊళ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈ ఏడాది కాఫర్‌ డ్యామ్‌ మూసేశాక బ్యాక్‌ వాటర్‌ మూలంగా వంద గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కున్నాయి. మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. సహజంగా జులై మధ్య నుంచి ఆగస్టు ఆఖరు వరకూ గోదావరికి ఉధృతంగా వరద తాకిడి ఉంటుంది. ఈసారి సీజన్‌ ప్రారంభంలోనే వరదల ప్రభావం కనిపిస్తోంది. ఇది
రాబోయే నెల రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. అదే జరిగితే నిర్వాసితులు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. గతంలో గోదావరికి పెద్ద వరదలన్నీ ఆగస్టులోనే వచ్చాయి. కాబట్టి వచ్చే నెల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యంత కష్టకాలం. ఇప్పటికే అవకాశం ఉన్నవారంతా ఒడ్డుకు చేరారు. కానీ గిరిజనలకు మాత్రం కాలనీలు సిద్ధం చేయక, ప్యాకేజీ అందక వరదల్లోనే గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పుడు వరదల్లో వారికి రవాణా సదుపాయాలు కూడా లేవు. నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచలేదు. గత ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏర్పడిన సమస్యలపై ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో అధికారులు తప్పిదాన్ని అంగీకరించారు. ఈసారి కూడా గత ఏడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తు న్నారు. ఆహార పదార్థాలు, కిరోసిన్‌ వంటివి అందుబాటులో ఉంచడం విూద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా యంత్రాం గం కదలాలి. నిర్వాసితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలి. పడవలు ఏర్పాటు చేసి రవాణా సదుపాయం కల్పించాలి. వరద సహాయక చర్యలు సమగ్రంగా చేపట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాస ప్యాకేజీ అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి భిన్నంగా సాగితే పోలవరం నిర్వాసితుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రమే భరించాలి. చట్ట ప్రకారం జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుని నిర్మాణ వ్యయంపై పరిమితులు విధించడం మానుకోవాలి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రయత్నిం చాలి. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటినా వరద చూడని గ్రామాలు కూడా ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటిమయమయ్యాయి. వామపక్షాలు, ఇతర నేతలు వరద బాధలను, నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం గురించి మొత్తుకుంటున్నా పాలకులు మిన్నకున్నారు. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న గ్రామాల ప్రజలు నానాయాతన పడుతున్నారు. కేంద్రం నుంచి నిధులు రాగానే అందచేస్తామని చెప్పడ తప్ప సిఎం జగన్‌ కూడా పెద్దగా ఏవిూచేయడం లేదు. నిర్వాసితులంతా ఊళ్లు వదిలిపోయేలా చేస్తున్నారు. చట్టాన్ని ప్రభుత్వమే యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం సర్వం వదిలిపోతున్న వారి జీవితాలతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తోంది.