దుర్గగుడి ఇవో బదిలీకి రాజకీయ ఒత్తిడి

బదిలీకి కొందరి యత్నాలు?
విజయవాడ,ఆగస్ట్‌20(జనం సాక్షి): బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్న కోటేశ్వరమ్మకు రాజకీయ సెగ మొదలయ్యిందని సమాచారం. ఆమెను బదిలీ చేయాలని కొందరు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు స్తానం చలనం తప్పదన్న ప్రచారం సాగుతోంది. ఆమె స్థానంలో అన్నవరం దేవస్థానం ఇన్‌ఛార్జి ఈవో ఎన్‌.వి.సురేష్‌బాబును నియమించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుత ఈవో కోటేశ్వరమ్మను తక్షణమే బదిలీ చేయాలంటూ రాజకీయంగా ఒత్తిడి వస్తుండటంతో ప్రభుత్వం కొత్త సురేష్‌బాబును పరిశీలిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలాఖరు నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఈవో కోటేశ్వరమ్మను బదిలీచేస్తే.. దసరా ఉత్సవాల నిర్వహణలో కొత్తగా వచ్చే ఈవోకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయన్న కోణంలో కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నా.. కోటేశ్వరమ్మను బదిలీ చేయించాల్సిందేనంటూ రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈవో కోటేశ్వరమ్మను బదిలీ చేసి.. ఆ స్థానంలో సురేష్‌బాబును నియమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని దుర్గగుడి వర్గాలు చెబుతున్నాయి. దుర్గగుడి ఈవోగా నియమించేందుకు ప్రభుత్వ పరిశీలనలో ఉన్న సురేష్‌బాబుది విజయవాడే. దేవాదాయశాఖలో ఆయన ఉద్యోగ జీవితం దుర్గగుడి విూదే ప్రారంభమైంది. కనకదుర్గమ్మ గుడిలో కిందిస్థాయి ఉద్యోగిగా చేరిన ఆయన అంచెలంచెలుగా పదోన్నతులు పొంది ఉన్నతస్థాయికి చేరుకున్నారు.  దుర్గమ్మ సన్నిధిలోనే ఆయన జూనియర్‌ అసిస్టెంట్‌గా, సీనియర్‌ అసిస్టెంట్‌గా, ఏఈవోగా పదోన్నతులు పొందారు. తర్వాత అసిస్టెంట్‌ కమిషనర్‌గా పదోన్నతి పొంది భీమవరం మావుళ్లమ్మ దేవస్థానానికి బదిలీపై వెళ్లారు. తర్వాత దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌గా గుంటూరులో పనిచేశారు. తర్వాత అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానానికి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఇన్‌ఛార్జి ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.