దేశంలోనే రాజస్థాన్‌కు అత్యధిక మౌలిక సదుపాయాలు

రాజస్థాన్‌కు ప్రత్యేక హూదా కోసం గెహ్లాట్‌ డిమాండ్‌!

జైపూర్‌, నవంబర్‌13 (జనంసాక్షి)  : జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద తమ రాష్ట్రానికి ప్రత్యేక హూదా ఇవ్వాంటూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆయుష్‌ రంగంలో రాజస్థాన్‌కు దేశంలోనే ”అత్యధిక’ మౌలిక సదుపాయాలు వున్నందున ఈ మేరకు ప్రతిపాదిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 వేల ఆయుష్‌ మెడికల్‌ సెంటర్లు పనిచేస్తున్నాయని సీఎం గెహ్లాట్‌ పేర్కొన్నారు. ”దేశంలోనే అత్యధిక ఆయుష్‌ ఆధారిత మౌలిక సదుపాయాలు ఉన్నందున జాతీయ ఆయుష్‌ మిషన్‌ కింద రాజస్థాన్‌కు ప్రత్యేక హూదా కల్పిస్తే.. జైపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఎన్‌ఐఏ)కి డీమ్డ్‌ యూనివర్సిటీ హూదా కల్పించేందుకు ముందడుగు పడుతుంది. శుక్రవారం 5వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఓ వర్చువల్‌ కార్యక్రమంలో గెహ్లాట్‌ ఈ మేరకు ప్రతిపాదించారు.

ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జామ్‌నగర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేద (ఐటీఆర్‌ఏ), జైపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఎన్‌ఐఏ)లను జాతికి అంకితం చేశారు. పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా ఐటీఆర్‌ఏకి జాతీయ ప్రాధాన్యతా సంస్థ (ఐఎన్‌ఐ) హూదా దక్కగా.. ఎన్‌ఐఏకి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కింద డీమ్డ్‌ యూనివర్సిటీగా గుర్తింపు దక్కింది. కాగా డీమ్డ్‌ యూనివర్సిటీ హూదాతో ఆయుర్వేదిక్‌, యోగా, నాచురోపతి, యునానీ, సిద్ధ, హూమియోపతి (ఆయుష్‌)కి అంతర్జాతీయంగా మరింత ప్రాముఖ్యత పెరగడంతో పాటు విస్తత పరిశోధనలకు అవకాశం కలుగుతుందని గెహ్లాట్‌ పేర్కొన్నారు.