దేశంలో కరోనా తగ్గుముఖం

– 24 గంటల్లో 45,149 కేసులు.. 480 మరణాలు

దిల్లీ,అక్టోబరు 26(జనంసాక్షి): భారత్‌లో తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 9,39,309 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 45,149 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,960 చేరింది. మరోవైపు కొవిడ్‌తో చికిత్స పొందుతూ తాజాగా 480 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,19,014కి చేరింది. జులై తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. జులై 10న 475 మరణాలు సంభవించాయి.తాజాగా కోవిడ్‌ నుంచి 59,105 మంది కోలుకోగా మొత్తం డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 71,37,228కి చేరింది. ప్రస్తుతం 6,53,717(8.26 శాతం) క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి. ఇక రికవరీ రేటు 90.23 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.50 శాతంగా ఉంది.