దేశంలో కొత్త స్ట్రేయిన్‌ వచ్చేసింది

భారత్‌లోకి కరోనా ‘కొత్త రకం’

బ్రిటన్‌ నుంచి వచ్చిన ఆరుగురిలో నిర్ధారణ

దిల్లీ,డిసెంబరు 29 (జనంసాక్షి): బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న కరోనా ‘కొత్త రకం’ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్తగా మార్పు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు తాజాగా తేలింది. బెంగళూరులోని నింహన్స్‌లో మూడు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధారణ అయినట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ అధికారంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఆరుగురిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. మరోవైపు కొత్తరకం కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఆరుగురి తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులును ట్రేసింగ్‌ చేస్తోంది. యూకేలో కొత్త రకం వైరస్‌ ఆందోళనకరంగా మారిన సమయంలో భారత్‌లో ఈ కేసులు వెలుగుచూడటం కలవరపెడుతోంది. ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్తరకం విజృంభిస్తుండటంతో అక్కడ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త రకం వైరస్‌ 70శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే భారత్‌ సహా పలు దేశాలు యూకేకు విమానసర్వీసులు నిలిపివేశాయి.భారత్‌లో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 31 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. అయితే 23 అర్ధరాత్రిలోగా భారత్‌కు చేరుకున్నవారికి ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులకు సోకింది కొత్త రకమా? కాదా? అన్నది తెలుసుకునేందుకు వారి రక్తనమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపించారు. తాజాగా ఈ ఫలితాలు వెలువడగా.. యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్త రకం వైరస్‌లను గుర్తించినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. నవంబరు 25 నుంచి డిసెంబరు 23 వరకు బ్రిటన్‌ నుంచి దాదాపు 33 వేల మంది ప్రయాణికులు వేర్వేరు విమానాశ్రయాల గుండా భారత్‌కు చేరుకున్నారు. వీరందరినీ ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించి వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ నేడు వెల్లడించింది. ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన వారిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది. మరోవైపు కొత్తరకం వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్‌ ఆంక్షలను జనవరి 31 వరకు పొడగిస్తూ కేంద్ర ¬ంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రిపూట కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించుకోవచ్చని సూచించింది. అయితే రాష్ట్రాల మధ్య, రాష్ట్ర పరిధిలోని వ్యక్తులు, వాహనాల రాకపోకలపై పరిమితులు విధించకూడదని స్పష్టం చేసింది.

కొత్తరకం’పై ఆందోళన వద్దు..! సీసీఎంబీ

బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌ మూలాలు భారత్‌లోనూ బయటపడ్డట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారిలో దాదాపు 40మందికి పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ(సీసీఎంబీ) విశ్లేషిస్తోంది. ఇప్పటివరకు జరిపిన విశ్లేషణలో ముగ్గురిలో కొత్తరకం వైరస్‌ గుర్తించినట్లు సీసీఎంబీ వెల్లడించింది.’బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ తేలిన 40శాంపిళ్లు మాకు చేరాయి. కొత్తరకం వైరస్‌ను కనుగొనేందుకు ఇప్పటివరకు 20శాంపిళ్ల విశ్లేషణ పూర్తిచేశాం. వీటిలో మూడు శాంపిళ్లలో బ్రిటన్‌ కొత్తరకం వైరస్‌ మూలాలు గుర్తించాం’ అని సీసీఎంబీ డైరెక్టెర్‌ రాకేశ్‌ మిశ్రా విూడియాకు వెల్లడించారు. కొత్తరకం వైరస్‌ కనిపించడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని.. అయితే పెద్ద ఎత్తున కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ కొత్త రకం వైరస్‌ బయటపడినప్పటికీ దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డెరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా స్పష్టంచేశారు. ఇది చూడడానికి కొత్తగా కనిపించినప్పటికీ, ఇది కూడా కరోనా వైరస్‌ కావడంతో ఎలాంటి సమస్య ఉండదని పేర్కొన్నారు. లక్షణాలు, తీవ్రత అన్నీ ఒకేవిధంగా ఉంటాయని, కేవలం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. అయితే, ఈ కొత్తరకం వైరస్‌ మాత్రం అత్యధిక వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నట్లు రాకేశ్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఇదిలాఉంటే, డిసెంబర్‌ 9వ తేదీ తర్వాత యూకే నుంచి తెలంగాణకు దాదాపు 1216 మంది వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 1060 మందిని ట్రాక్‌ చేసి వైద్య పరీక్షలు నిర్వహించింది. మరో 156 మంది ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇప్పటికే ఆరుగురు తిరిగి విదేశాలకు వెళ్లిపోగా, మరో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఇక కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహించిన 996 మందిలో 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.