దేశంలో తొలిసారిగా లైఫ్‌సైన్సెస్‌ పాలసీ తీసుకొస్తాం

` ఈ రంగంలో గ్లోబల్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారనుంది
` ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికశక్తిగా తెలంగాణ అవతరిస్తుంది
` ఇదే లక్ష్యంతో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణల కోసం సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోంది
` బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రతి ఏటా నిర్వహించే బయో ఏషియా సదస్సు హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా నిలబెట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. హెల్త్‌ కేర్‌ రంగం భవిష్యత్త్‌ నిర్దేశించటంతోపాటు ప్రపంచానికే మార్గదర్శనం చేసేలా బయో ఏషియా దేశ విదేశాలను ఆకర్షిస్తోందని చెప్పారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన ఫార్మా, హెల్త్‌ కేర్‌, లైఫ్‌ సైన్స్‌, బయోటెక్‌ కంపెనీలు ఎన్నో హైదరాబాద్‌ నుంచి పనిచేస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఏషియా-2025 కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..’రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణను ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోంది. మేము ఇంతకాలం ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టాం. ఎందరో శాస్త్రవేత్తలు, శాస్త్ర, సాంకేతిక నిపుణులు, ఇంజినీర్ల సమూహాన్ని తయారు చేశాం. జీనోమ్‌ వ్యాలీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ సిటీ ఏరియా సేవల రంగానికి ప్రాధాన్యమిస్తాం. హైదరాబాద్‌ లో ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీతోపాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. దేశంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల రాజధానిగా అవతరించింది. దేశంలోనే అత్యధిక ఎలక్టిక్ర్‌ వాహనాల అమ్మకాలు ఇక్కడే జరుగుతున్నాయి. 3,000 ఎలక్టిక్ర్‌ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నాం. కోర్‌ సిటీ వెలుపల ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకూ మాన్యుఫ్యాక్షరింగ్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తాం. ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాలలో ఒకటిగా దీన్ని నెలకొల్పుతాం. ప్రపంచం నలుమూలాల నుంచీ పెట్టుబడులను ఆహ్వానిస్తాం. ఓఆర్‌ఆర్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌.. ఈ రెండు రింగ్‌లను రేడియల్‌ రోడ్లతో అనుసంధానిస్తాం. ఈ రహదారులకు ఇరువైపులా క్లస్టర్లను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం. ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి ఏపీలోని సీ పోర్టుకు అనుసంధానించేందుకు ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తాం. బయోసైన్సెస్‌, బయోటెక్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నాం. నిన్ననే హైదరాబాద్‌లో ఆమ్జెన్‌ సంస్థ తమ కార్యకలాపాలను విస్తరించింది. ఇది మా సహకారానికి నిదర్శనం. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, మా ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలని, మాతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు అన్నింటినీ ఆహ్వానిస్తున్నాం. సులభమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉంది. ఇటీవల దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదికలోనూ తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోనూ రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించాం. దాదాపు 150పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు విస్తరించాయి. ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఫార్మా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం. ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ఆశిస్తున్నాం. ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్ట్‌ కింద కీలకమైన గ్రీన్‌ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అతిపెద్ద ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. జర్మన్‌ కంపెనీ మిª`టలెని బయోటెక్‌ జీనోమ్‌ వ్యాలీలో తన సెల్‌, జన్యు చికిత్సను ప్రారంభించింది. ఈ వేదిక పైనుంచి మరో నాలుగు బహుళజాతి కంపెనీలను మా పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నాం. 25 సంవత్సరాల్లో ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్‌ హెల్త్‌ పవర్‌ హౌస్‌గా హైదరాబాద్‌ పేరు నిలుపుకుంది. గతేడాది ఏఐ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించాం. దేశవిదేశాల నుంచి బయో ఏషియా సదస్సుకు హాజరైన ప్రముఖుల గొప్ప మనస్సుకు అభినందనలు. విూరందరూ తెలంగాణను అనువైన వేదికగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ పొందిన ప్రొఫెసర్‌ పాట్రిక్‌ టాన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని’ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటి సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.