దేశమంతా తిరిగి ఒక్కటి చేస్తాం
– వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ కూటములపైనే దృష్టి
– నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్
న్యూఢిల్లీ, ఆగస్టు6(జనం సాక్షి ) : వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి. జాతీయ స్థాయిలో కాకుండా ప్రాంతీయంగా అన్ని పార్టీలతో కూటములను ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యమని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడలతో కలిసి దేశమంతా పర్యటించి ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తామని అన్నారు. 1975-77 ప్రభుత్వ కాలంలో ఇందిరాగాంధీపై ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకత ప్రస్తుతం ప్రధాని మోడీపై మొదలైందని అన్నారు. మోడీ దేశానికి ఏదో చేస్తాడని ఇన్నాళ్లూ ఉన్న భ్రమలు తొలగిపోయాయని ఎద్దేవా చేశారు. గతంలో లోకమాన్య జయప్రకాశ్ నారాయణ్ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి కేంద్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడంతో ఇందిరాగాంధీ ఓటమిని ఎదుర్కొన్నారని, దీంతో జనతా పార్టీ నుండి మొరార్జీ దేశారు ప్రధానిగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్య కూటమి బిజెపిపై విజయం సాధిస్తే ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారని ప్రశ్నించగా.. ప్రస్తుత తరుణంలో సరైన ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీయేనని, అందరూ ఆయనవైపే మొగ్గుచూపుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
——————————