దేశవ్యాప్తంగా 14 మంది అనుమానితులను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

3

న్యూఢిల్లీ,జనవరి22(జనంసాక్షి):దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర ¬ంశాఖ తెలిపింది. వీరిలో 12 మందిని ఎన్‌ఐఏ, ఇద్దరిని మహారాష్ట్ర ఏటీఎస్‌ అరెస్ట్‌ చేసినట్లు ¬ంశాఖ అధికారులు వెల్లడించారు. హరిద్వార్‌లో పట్టుబడిన వారికి ఈరోజు అరెస్టయిన వారికి సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. హరిద్వార్‌లో పట్టుబడిన వారు రైళ్లలో బాంబులు పెట్టాలని కుట్ర పన్నితే… ఈరోజు పట్టుబడిన వారు గృహ సముదాయాల వద్ద అలజడి సృష్టించాలని కుట్ర పన్నినట్లు చెప్పారు. పట్టుబడిన వారంతా పేలుడు పదార్థాలు సమకూర్చుకునే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇండియన్‌ ముజాహిద్దీన్‌ మాజీ ఉగ్రవాది యూసుఫ్‌ ఆర్మర్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.6లక్షల నగదు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు సమకూర్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌, ముంబయి, కర్నాటకలో అరెస్టయిన వారి నుంచి బాంబు తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి వ్యవహారాలన్నీ ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నట్లు ¬ంశాఖ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరుల ఏరివేతకు ఎన్‌ఐఏ, మహారాష్ట్ర ఏటీఎస్‌, పోలీసులు సంయుక్తంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అదుపులోకి తీసుకున్న వారందరినీ దిల్లీకి తీసుకొచ్చి విచారించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో పట్టుబడిన ఉగ్రవాదులు వీరే…

ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌లో నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. టోలీచౌకికి చెందిన నఫీజ్‌ఖాన్‌, ఉబేదుల్లాఖాన్‌, షరీఫ్‌ మొయినుద్దీన్‌తో పాటు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అబూ అమాస్‌ను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌ఐఏ ప్రకటించింది. వీరి నుంచి భారీ మొత్తంలో పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.