దొడ్డు బియ్యం పాలిష్‌ చేస్తే సన్నబియ్యం కావు

5

– ఎన్నడైనా హాస్టళ్లలలో ఉన్నారా..?

– కనీసం బస చేశారా?

– రేవంత్‌పై ఈటెల ఫైర్‌

హైదరాబాద్‌  అక్టోబర్‌12(జనంసాక్షి):

దేశంలో ఎక్కడా లేని విధంగా హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారం వడ్డిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఈటెల విూడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు తినే తిండిపై కూడా రాజకీయాలు చేయడం సరికాదు. దొడ్డు బియ్యం పాలిష్‌ చేస్తే సన్న బియ్యం కావు.

నంగనాచి మాటలు మాట్లాడే టీడీపీ నేతలు ఏనాడైనా హాస్టల్స్‌లో ఉన్నారా? బస చేశారా? తాము ఎమ్మెల్యేలుగా ఉండి ఉద్యమ సమయంలో హాస్టల్‌ విద్యార్థులతో సహజీవనం చేసిన చరిత్ర మాది. ఆ సమయంలో విద్యార్థులు ఎటువంటి తిండి తిన్నారో.. వారి కష్టాలెంటో తమకు తెలుసు. ఆ క్రమంలోనే హాస్టళ్ల నిర్వహణను ఒకే గొడుగు కిందకు తెచ్చాం.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం. మానవతా కోణంలో ఆలోచించి హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నాం. అంతే కానీ మరొకటి లేదు. విూ హయాంలో మక్కిపోయిన బియ్యం సరఫరా చేశారు. దొడ్డు బియ్యం బువ్వ తినలేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. నోటి కాడి బువ్వ పందుల పాలు అయ్యేది. లేదా చెత్తకుప్పల్లో ఉండేది.కానీ ఇప్పుడు హాస్టల్స్‌కి వెళ్లి చూడండి. పిల్లలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు. సంతోషంగా నిద్ర పోతున్నారు. సన్న బియ్యం సరఫరా కోసం రూ. 642 కోట్లు వెచ్చిస్తున్నాం. హాస్టల్స్‌ అంటే తెల్వదు టీడీపీ నేతలకు. సంపాదనే ధ్యేయంగా, స్వార్థమే ఎజెండాగా బతికే విూకు హాస్టల్‌ విద్యార్థులకు సన్న బియ్యంపై మాట్లాడే అర్హత లేదు. టీడీపీ నేతలు కుసంస్కారంతో నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.