నగరంలో ఘోర అగ్నిప్రమాదం..

  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. మరో ఇద్దరికి గాయాలు

    న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వాయువ్య ఢిల్లీలోని పితాంబురా, కోహట్ ఎన్‌క్లేవ్‌ మొదటి అంతస్థులో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో భవనంలో మంటలు చెలరేగినట్టు తమకు సమాచారం అందినట్టు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటినా 8 అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గంటపాటు శ్రమించిన అనంతరం మంటలను అదుపులోకి తెచ్చినట్టు తెలిపారు.

    ప్రమాద సమయంలో నాలుగు అంతస్థుల భవనంలోని మొదటి అంతస్థులోని ఫ్లాట్‌లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు నిద్రిస్తున్నారు. కింద నుంచి పొగలు రావడంతో గమనించిన వారు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ దట్టమైన పొగలు భారీగా అలుముకోవడంతో ఊపిరాడక చనిపోయారని తెలిపారు. మరో ఆరుగురిని రక్షించి బయటకు తీసుకవచ్చినట్టు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబేద్కర్ ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో 90ఏళ్ల వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యలు వెల్లడించారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.