నరసరావుపేట శివార్లకు మంచినీటి సమస్య 

గుంటూరు,మే18(జ‌నంసాక్షి): శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఇటీవలే నరసరావుపేట పురపాలక సంఘం వందేళ్ల  వేడుకలు ఘనంగా నిర్వహించుకుంది. కోడెల ప్రతి విషయంలోనూ ముందుండి సమస్యను పరిస్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఐతే నానాటికి పెరిగి పోతున్న  జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో మునిసిపాలిటి పని తీరు
ఆశాజనకంగా లేదని విమర్శలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పసట్టణ నీటి సమస్య తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. శివారుకాలనీలు ఏర్పడడంతో సమస్య తీవ్రంగా మారింది. నరసరావుపేట ఏర్పడి 200 సంవత్సరాలు పురస్కరించుకుని 1997 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి పధకానికి ద్విశతాబ్ది ఉత్సవాలు అనుసంధానం చేసి 2వ మంచి నీటి పథకాన్ని ప్రారంభించి పూర్తీ చేసింది, ఐతే మునిసిపాలిటీ పరిధిలోనే పైపు లైన్లు ఉండటం తరవాత కాలంలో పరిధి దాటి జనవాసాలు పెరగటంతో  ఆయా ప్రాంతాల ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొనక తప్పడం లేదు, నరసరావుపేట మునిసిపాలిటీ పరిధి దాటి ఎన్నో కాలనీలు ఏర్పడ్డాయి, ఆయా ప్రాంతాల్లో ని ప్రజలు ట్యకర్ల పై ఆధారపడక తప్పడంలేదు. ట్యాంకర్లు పనిచేస్తున్నా  వృద్దులు ఆడవాళ్లు ఎంతో ఇబ్బందికి
గురవుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన జరిగిన నేపథ్యంలో మునిసిపాలిటీ పరిధిని పెంచి శివారు కాలనీలను గుర్తించి నరసరావుపేట మునిసిపాలిటీలో కలిపి తమ కాలనీలకు మంచి నీరు అందేలా చేయాలనీ అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.  మంచి నీరు సరిగా అందటం లేదని తెల్లవారుజామునే లేచి మంచి నీటి కోసం ఎదురు చేస్తుంటే అవసరాలకు సరిపడా మంచి నీరు అందటం లేదని అంటున్నారు.  గొంతు తాడుపుకునేందుకు గుక్కెడు నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మునిసిపాలిటీ ప్రజలకు నీరు అందించేందుకు రెండు మంచినీటి పథకాలు ఉన్నప్పటికీ శివారు ప్రాంతాలలో నివసించే బడుగు బలహీన వర్గాల వారు తాగు నీటి కోసం అల్లాడుతున్నారు.