నష్టాల్లో స్టాక్మార్కెట్లు
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఈ ఉదయం సరికొత్త రికార్డులతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఆ జోరును ఎంతోసేపు కొనసాగించలేకపోయాయి. బ్యాంకింగ్, టెలికాం, ఫార్మా రంగాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో రికార్డుల నుంచి పడిపోయిన మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా పడిపోగా.. నిఫ్టీ కూడా నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 183 పాయింట్ల నష్టంతో 33,548 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 10,401 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడి రూ.64.85గా కొనసాగుతోంది.
లుపిన్ షేర్లు ఢమాల్
ఎక్స్ఛేంజీల్లో లుపిన్ షేర్లు భారీగా పడిపోయాయి. ఒక్కో షేరు విలువ ఎన్ఎస్ఈలో 15శాతం, బీఎస్ఈలో 17శాతం మేర నష్టాల్లో కొనసాగుతోంది. ఇక యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యస్బ్యాంక్, సన్ఫార్మా, రిలయన్స్ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.