నామమాత్రంగా కూడా ప్రభుత్వం పనిచేయడం లేదు: బాబు

ఖమ్మం : రైతు సమస్యలపై నామామాత్రంగా కూడా ప్రభుత్వం పనిచేయడం లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఖమ్మంలో వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాదిరిపురంలో చంద్రబాబు కేకే కట్‌ చేసి నేతలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచి రూ. 30,500 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి వస్తే ఉపాధిహామీని వ్యవసాయంతో అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. అసమర్థ అవినీతి ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. సహకార సంఘాల సభ్యత్య నమోదులో కాంగ్రెస్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తప్పు చేయకపోయిన తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.