నా కూతురును కూడా సైన్యంలో చేరుస్తా

5
– హనుమంతప్ప భార్య

నాగ్‌పూర్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): ‘నాకు కొడుకులు లేరు.. ఉంది ఒక్క కూతురు.. తనని సైన్యంలో చేరుస్తా’నని అమరజవాను హనుమంతప్ప భార్య మహాదేవి అన్నారు. గురువారం హనుమంతప్ప తల్లిదండ్రులను పలు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హనుమంతప్ప భార్య మహాదేవి మాట్లాడుతూ ‘నాకు కొడుకులు లేరు.. అందుకు నేను బాధపడటం లేదు, నా కుమార్తెనే సైన్యంలో చేరుస్తాన’ని పేర్కొన్నారు. అలా చేయడమే తన భర్తకి నిజమైన నివాళి అవుతుందని ఆమె పేర్కొన్నారు. దేశానికి సేవ చేసేందుకు తన బిడ్డను ఇవ్వడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంతప్ప సోదరుడు శంకర్‌ గౌడకి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ లక్ష రూపాయల చెక్కును అందించారు. ఫిబ్రవరి 11న సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆరు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన జవాను లాన్స్‌ నాయక్‌ హనుమంతప్ప అనంతరం చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.