నిద్రిస్తున్న విద్యార్థిపై బ్లేడుతో దాడి

విజయనగరం,జూలై22 (జ‌నంసాక్షి): నిద్రిస్తున్న ఓ విద్యార్థిపై సీనియర్‌ విద్యార్థులు బ్లేడ్‌తో దాడిచేసిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని జోగింపేట సాంఘిక సంక్షేమ బాలయోగి గురుకులంలో విద్యార్థి డర్రు సిద్ధార్థ వసతిగృహంలో ఉండి ఎనిమిదోతరగతి చదువుకుంటున్నాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రిస్తుండగా అర్ధరాత్రి కొంతమంది సీనియర్‌ విద్యార్థులు బాధితుడి ముఖంపై దుప్పటి కప్పి బ్లేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్థికి ఎడమచేయి, పొట్టపై గాయాలయ్యాయి. తీవ్ర భయభ్రాంతులకు గురైన విద్యార్థి వేకువజామున గురుకులం బయటకు వచ్చి కాలిబాటన మండలంలోని స్వగ్రామమైన మారికివలసకు చేరుకొని తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపాడు. తండ్రి తవిటిరాజు బాధితుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌ చదువుతున్న వారుగా గుర్తించారు. ఈ మేరకు సీతానగర్‌ ఎస్సై కళాధర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.