నివాసాల మధ్య కూలిన సైనిక విమానం

` సాధారణ పౌరులతో సహా 46 మంది మృతి.. పదిమందికి తీవ్రగాయాలు
` సూడాన్‌లో చోటుచేసుకున్న ఘోర దుర్ఘటన
` టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రమాదం
వాడి సయిద్నా(జనంసాక్షి):సూడాన్‌లో మంగళవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేకుంది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఓ సైనిక విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే నివాసాల మధ్య కుప్పకూలిందిఈ ఘటనలో 46మంది సైనిక సిబ్బందితో పాటు పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పది మందికి పైగా గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడిరచారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదని.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.సూడాన్‌పై పట్టు కోసం సైన్యం పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం ఇటీవల తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో న్యాలా ప్రాంతంలో ఇటీవల ఓ సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు డార్ఫర్‌ పశ్చిమ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్‌ ప్రకటించింది. అయితే ప్రస్తుత ప్రమాదానికి ఈ ఘర్షణలకు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.