నేడు ఖేడ్‌ ఉపఎన్నిక లెక్కింపు

3

– మధ్యాహ్నానికి తుది ఫలితం

మెదక్‌,ఫిబ్రవరి 15(జనంసాక్షి): నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేవారు. ఈనెల 13న ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈమేరకు రేపు ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాల నిఘా మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగించనున్నారు. 14 టేబుళ్లలో కౌంటింగ్‌ పక్రియ కొనసాగనుంది. 21 రౌండ్ల తర్వాత తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. ప్రతీ రౌండ్‌ ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయనున్నారు. ఉదయం 8గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు ముగియనుంది.  ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల్లోపు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కళాశాల పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించబోమని, అందుకోసం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుండగా  పోలీసు బందోబస్తు ఏర్పాట్లను మెదక్‌ డీఎస్పీ రాజారత్నం సవిూక్షించారు. మంగళవారం నారాయణఖేడ్‌ పట్టణంలో సంత రోజు. దీంతో లెక్కింపు కేంద్రమైన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంతంలో అధిక జనం వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కళాశాలకు కొద్ది దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేసి జనాన్ని నిలువరించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.  పాలిటెక్నిక్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నందున అందులో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 21 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లతో పాటు మరో మెయిన్‌ టేబుల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్వో వాసం వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రతి టేబుల్‌ వద్ద నలుగురు గెజిటెడ్‌ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. రౌండ్ల వారీగా ఫలితాలను వెబ్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు విూడియాకు అందిస్తామని ప్రకటించారు.

ఉపఎన్నిక కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తిచేయాలి:భన్వర్‌లాల్‌

రెండు రోజులక్రితం ప్రశాంతంగా ముగిసిన నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌ కు అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చేయాలని ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ మెదక్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌నుంచి వీడియో కాన్పరెన్స్‌లో కౌంటింగ్‌కు సంబందించి సవిూక్షించారు. ఈసందర్బంగా భన్వర్‌ లాల్‌ మాట్లాడుతూ 16వతేదీన ఉదయం 8 గంటలకు ఎట్టి పరిస్థితిలోనూ కౌంటింగ్‌నుప్రారంభించాలన్నారు. ప్రతిరౌండ్‌కు ఒక మైక్రో అబ్జర్వర్‌ను, వీడియో గ్రాఫర్‌ను నియమించాలన్నారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టేంట్లు, మైక్రో అబ్జర్వర్ల మూడవ ర్యాండమైజేషన్‌ను ఈనెల 16న ఉదయం 5 గంటలకు అబ్జర్వర్ల సమక్షంలో నిర్వహించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోనికి మొబైల్‌ ఫోన్‌లను అనుమతించకూడదన్నారు. రౌండ్ల వారిగా ఫలితాలను తమ కార్యాలయానికి మెయిల్‌ ద్వారా, ఫ్యాక్స్‌ ద్వరా పంపించాలన్నారు. జిల్లా ఎన్నికల అదికారి అయిన కలెక్టర్‌ మాట్లాడుతూ నారాయణ్‌ఖేడ్‌ కౌంటింగ్‌ను  మండలంలోని జూకల్‌ గ్రామంలోగల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోనిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 14 కౌంటింగ్‌ టేబుల్లనే ఏర్పాటుచేసి 21 రౌండ్లలో పూర్తి చేస్తామన్నారు, మొత్తం 14 టేబుల్లకు 16మంది సూపర్‌ వైజర్లను నియమించి అందులో ఇద్దరిని రిజర్వ్‌గా ఉంచుతున్నామన్నారు. 16మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లలో ఇద్దరు రిజర్వ్‌ ఉంటారని 19మంది మైక్రో అబ్జర్వర్లలో ఐదుగుకు రిజర్వ్‌గా ఉంటారన్నారు. ఈనెల 9న 15న కౌంటింగ్‌పై శిక్షణనిచ్చామన్నారు. ఈనెల 15న మైక్రో అబ్జర్వర్లలకు కౌంటింగ్‌ కేంద్రంలోనే శిక్షణిచ్చామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమరాలనుఏర్పాటుచేశామన్నారు. గట్టి బందోబస్తు చర్యలు  కూడా తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డినుంచి ఎన్నికల పరిశీలకులు అయిన సరేందర్‌సింగ్‌ పాటిల్‌, రాజేశ్‌కుమార్‌ రాయ్‌, అదనపు ఎస్పీ వెంకన్న, డీఆర్‌ఓ దయానంద్‌ రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వర్లు ఆర్డీఓ నగేశ్‌ తదితరులుపాల్గోన్నారు.