నేడు మునుగోడులో కాంగ్రెస్‌ సభ

కార్యకర్తల్లో విశ్వాసం నింపేలా చర్యలు
హాజరవుతున్న రేవంత్‌ తదితరులు

నల్లగొండ,ఆగస్ట్‌4(జనం సాక్షి ): ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటనతో మునుగోడు నియోజకవర్గం రాజకీయంగా వేడెక్కుతోంది. ఇక్కడ అప్పుడే పార్టీల హల్‌చల్‌ మొదల య్యింది. దీనిపై పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్‌ పెడుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి త్వరలో రాజీనామా చేయనున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. రాజీనామా చేసిన అనంతరం రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరి అభ్యర్థిగా రంగంలో దిగనున్నారు. కాంగ్రెస్‌ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. చండూర్‌ మండలంలో జరిగే సభకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌, భట్టి విక్రమార్క , మధు యాష్కీ తదితర కాంగ్రెస్‌ ముఖ్యనాయకులు హాజరు కానున్నారు. గురువారం మునుగోడు కాంగ్రెస్‌ కార్యకర్తలతో సన్నాహక సమావేశం జరిగింది. మాజీ ఎంపీలు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ మంత్రి ఆర్‌ దామోదర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్‌..మల్లురవిలు హాజరయ్యారు. ఆర్‌ దామోదర్‌ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం భారీ బహిరంగ సభ జరుగనుంది. మునుగోడు క్యాడర్‌ ను కాపాడుకొనే ప్రయత్నంలో నేతలున్నారు. సిట్టింగ్‌ సీటును దక్కించుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. మునుగోడుపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ పై ముప్పేట దాడి చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాజగోపాల్‌ రెడ్డి వెంట కాంగ్రెస్‌ కార్యకర్తలు వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థిపై అప్పుడే తర్జనభర్జన పడుతున్నారు.