నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్..!

 

న్యూఢిల్లీ (జనంసాక్షి):-తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. తెలంగాణతోపాటు మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో పర్యటించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు పూర్తిచేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో నవంబర్‌ మధ్య నుంచి డిసెంబర్‌ తొలివారంలోపు జరపవచ్చని ఈసీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడుతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది