నేను సభలో మాట్లాడితే భూకంపం..!!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమాధానమిచ్చారు. ‘నేను సభలో మాట్లాడితే భూకంపం వస్తుంది’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ‘ఆ భూకంపమేదో పార్లమెంట్లో ఎవరూ లేని సమయంలో వస్తే బాగుణ్ణు’ అంటూ చమత్కరించారు. నోట్ల రద్దు అంశంపై ప్రధానిని విమర్శించే హక్కు రాహుల్కు లేదన్నారు. అవినీతి అంతం చేయాలనుకోవడం తప్పా? నల్లకుబేరులను శిక్షించాలనుకోవడం నేరమా? అంటూ వెంకయ్య ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. అంతకుముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ.. నోట్ల రద్దు అంశంపై పార్లమెంట్లో తనను మాట్లాడనీయడం లేదని, తాను మాట్లాడితే భూకంపం వస్తుందని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు పెద్ద కుంభకోణం అని, దాన్ని తాను నిరూపించగలనని అంటూ ప్రభుత్వం తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, పెద్దనోట్ల రద్దుపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారంటూ విమర్శించారు.