నేపాల్‌ మాజీ ప్రధాని కోయిరాల కన్నుమూత

1

ఖాట్మండ్‌,ఫిబ్రవరి 9(జనంసాక్షి):నేపాల్‌ మాజీ ప్రధాని సుశీల్‌ కొయిరాలా(79) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలో చికిత్స చేయించుకుని ఇటీవలే నేపాల్‌లోని ఆయన స్వగ్రామమైన మహారాజ్‌గంజ్‌కి చేరుకున్నారు. ఉదయం మళ్లీ అస్వస్థతకు గురైన సుశీల్‌ కొయిరాలా తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని నేపాలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. గురువారం నేపాల్‌లో సుశీల్‌ కొయిరాల అంత్యక్రియలు నిర్వహించ నున్నారు. ఉదయం నేపాల్‌ మంత్రివర్గం సమావేశమై సుశీల్‌ కొయిరాలా మృతికి సంతాపం తెలిపింది.అవినీతి ఆరోపణలేవీ లేకుండా నిరాడంబరంగా జీవించిన నేతల్లో నేపాల్‌ మాజీ ప్రధాన మంత్రి సుశీల్‌ కొయిరాలా ప్రముఖుడు. నేపాల్‌లో ప్రజాస్వామ్యం కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ప్రధాన మంత్రి పదవిని నిర్వహించినప్పటికీ సామాన్య జీవనం గడిపారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. సుశీల్‌ కొయిరాలా 2014 ఫిబ్రవరి 10న నేపాల్‌ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. నేపాల్‌ నూతన రాజ్యాంగంపై నిరసన వ్యక్తం చేస్తూ భారతదేశంతో సరిహద్దుల్లోని కీలక వాణిజ్య కేంద్రాన్నిమూసివేయడం, నిరసనలు కొనసాగుతుండటంపై రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో గత అక్టోబరులో కొయిరాలా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొయిరాలా 1939 ఆగస్టు 12న భారతదేశంలోని వారణాసిలో జన్మించారు. ఆయన మాజీ ప్రధాన మంత్రులు మాత్రిక ప్రసాద్‌ కొయిరాలా, గిరిజా ప్రసాద్‌ కొయిరాలా, బిశ్వేశ్వర్‌ ప్రసాద్‌ కొయిరాలాలకు సవిూప బంధువు. ఆయన 1954లో రాజకీయాల్లో ప్రవేశించారు. 1960లో రాజరికం రావడంతో ఆయన 16 సంవత్సరాలపాటు భారతదేశంలో రాజకీయ ఆశ్రయం పొందారు. 1973లో విమానం హైజాక్‌ సంఘటనలో ప్రమేయం ఉండటంతో మూడేళ్లు భారతదేశంలో జైలు శిక్ష అనుభవించారు. నేపాలీ కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల పక్రియ కొనసాగుతున్న దశలో సుశీల్‌ కొయిరాలా మరణించడంతో ఆ పార్టీగ్భ్భ్రాంతికి గురైంది. అధ్యక్ష పదవికి పోటీలో ఆయన ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల పక్రియను నిలిపేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రధాని మోదీ సంతాపం

నేపాల్‌ మాజీ ప్రధాని సుశీల్‌ కొయిరాలా మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. అతను భారత్‌కు  మంచి స్నేహితుడిని, నేపాల్‌ గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొంటూ ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు. కొయిరాలా మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొయిరాలా అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపారని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. నేపాల్‌ ప్రజలకు, కొయిరాలా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.  నేపాలీ కాంగ్రెస్‌కు వివిధ పదవుల్లో పనిచేసిన కొయిరాలా 2010లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  2013 ఎన్నికల్లో నేపాల్‌లో కొయిరాలా ఆధ్వర్యంలో నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం దక్కించుకుంది. కొయిరాలా

2014 ఫిబ్రవరి 11 నుంచి 2015 అక్టోబర్‌ 12 వరకు నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.  ఆయన ఆధ్వర్యంలో నేపాల్‌లో పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాస్వామ్య బద్ధమైన కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.  కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో సుశీల్‌ 2015 అక్టోబరులో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.  అవినీతి ఆరోపణలేవీ లేకుండా నిరాడంబరంగా జీవించిన నేతల్లో నేపాల్‌ మాజీ ప్రధాన మంత్రి సుశీల్‌ కొయిరాలా ప్రముఖుడు. నేపాల్‌లో ప్రజాస్వామ్యం కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ప్రధాన మంత్రి పదవిని నిర్వహించినప్పటికీ సామాన్య జీవనం గడిపారు.