పంచాయితీ ఎన్నికలపై తొలగని ప్రతిష్ఠంభన

ఇటీవల బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పంచాయితీ ఎన్నికలు వెనక్కి పోయాయి. దీనిపై వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు ఎన్నికల ప్రక్రియను ఆపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయితీ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్లినా హైకోర్టు తీర్పుతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో ముందుకు వెళ్లడా లేక ఆగిపోవడమా అన్నది తెలియడం లేదు. అలాగే గడువులోగా ఎన్నికల నిర్వహణ కూడా సాధ్యం కాకపోవచ్చు. బిసి రిజర్వేషన్లపై క్లారిటీ ఉంటే తప్ప ఎన్నికలకు వెళ్లేలా కనిపించడం లేదు. ఈ దశలో విపక్ష పార్టీలు కూడా సాధారణ ఎన్నికల తరవాతనే పంచాయితీ ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాయి. తాము అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్‌,బిజెపిలు సాధారణ ఎన్నికల తరవాతనే పంచాయితీ ఎన్నికలు జరగాలని కోరకుంటున్నాయి.అయితే ఎన్నికలు జరపడం లేదా వాయిదా వేయడం లేదా ప్రత్యేక అధికారులను కొనసాగించడం లేదా ఉన్న సర్పంచ్‌ల పదవీ కాలాన్ని పొడిగించడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజ్యాంగంలో దీనికి సంబంధించి ప్రత్యేక ప్రస్తావన లేదు. వాస్తవానికి ఈ నెలాఖరుతో గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు పదవీకాలం పూర్తి కానుంది. ఆ లోగా పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేనే లేవు. ఆ తర్వాత కూడా ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారన్న అంశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. దీంతో ఆగస్టు 1 కల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను జూలైలోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పక్రియను కూడా చాలావరకు పూర్తి చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లు, బీసీల్లో ఏ, బీ, సీ, ఈ కేటగిరీ వంటి వాటిపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. బీసీ జనాభా, రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లు పూర్తి చేసినట్టు ప్రభుత్వం వాదించింది. అయితే మళ్లీ బీసీల గణన పూర్తి చేసి, జనాభా ప్రకారం రిజర్వేషన్ల పక్రియ చేపట్టిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలంటూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఎన్నికలకు కళ్లెం పడినట్టైంది. బీసీల గణన పూర్తయ్యేనాటికి కనీసం మూడు నాలుగు నెలలు పట్టే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. బీసీ గణన, కులాల వారీగా లెక్కింపు పూర్తయి, రిజర్వేషన్లు కేటాయించే సరికి ఇంకొంత సమయం కావాల్సి ఉంటుందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోపు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవచ్చని అటు అధికార పార్టీ నేతలు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలతో ఎన్నికైన ప్రతినిధులకే గ్రామ పాలన పగ్గాలు అప్పగించడమా? ప్రత్యేక అధికారులను నియమించడమా అన్న అంశంపై ప్రభుత్వం త్వరలోనే తేల్చనుంది. రాజ్యాంగంలోని 73వ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీలకు ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది. ఐదేళ్ల లోపు కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే ఏం చేయాలన్న దానిపై రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు లేవని రాజ్యాంగ నిపుణులు వెల్లడించారు. గ్రామ పంచాయతీల పాలక వర్గాలను పొడిగించాలనుకున్నా, ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించాలను కున్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ విషయలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగపరంగా అవరోధాలేవిూ ఉండవని అంటున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇకపోతే సార్వత్రిక ఎన్నికలయ్యే దాకా ఇప్పుడున్న సర్పంచులు, గ్రామ పాలక వర్గాలను యథాతథంగా కొనసాగించడం ద్వారా అదనపు భారాన్ని నెత్తిన

వేసుకోవద్దని ప్రభుత్వం భావించే పరిస్థితుల్లో వారినే కొనసాగించవచ్చు. ప్రస్తుత సర్పంచులు, వార్డు సభ్యులను కొనసాగిస్తే అధికార పార్టీపై వారికి సానుకూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది టిఆర్‌ఎస్‌కు కూడా కలసి వస్తుంది. అయితే ప్రత్యేకాధికారులు లేదా పర్సన్‌ ఇన్‌చార్జీలకు బాధ్యతలను అప్పగించడం వలన సర్కార్‌కు అదనపు తలనొప్పి కానుంది. గ్రామాల్లో సమస్యలపై ప్రజల్లో వ్యతిరేకత రానుంది. ఇది వచ్చే ఎన్నికలపై తీవ్రప్రభావంచూసే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో ఏది మేలన్నది సిఎం కెసిఆర్‌ ఆలోచించి నిర్ణయం తసీఉకునే అవకాశాలు ఉన్నాయి. సహకార సంఘాలకు ఐదారు నెలల క్రితమే పదవీకాలం పూర్తయినా పాత పాలకవర్గాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్పంచ్‌ల విషయంలోనూ ఇదే తరహాలో ముందుకెళ్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాలు కూడా తమ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. సహకార సంఘాలకు ఐదారు నెలల క్రితమే పదవీకాలం పూర్తయినా పాత పాలక వర్గాలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమకూ అలాగే ఎన్నికలయ్యే వరకు పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచులు కోరుతున్నారు. అయితే ఇందులో ఏది సమ్మతమన్నది ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశాలను సిఎం కెసిఆర్‌ కసరత్తు చేస్తున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే స్పస్టత రావచ్చు.