పట్టాలపై తాగుతూ రైలుకు బలయ్యారు
న్యూఢిల్లీ,అక్టోబర్30(జనంసాక్షి): ఓ ముగ్గురు వ్యక్తులు ఉదయమే మందు తాగేందుకు రైలు పట్టాల విూద తీరిగ్గా కూర్చున్నారు. పక్క ట్రాక్ విూద ఎదురుగా వస్తున్న రైలు డ్రైవరు వారిని చూసి హారన్ కొట్టాడు. మన గురించి కాదులే అనుకుని వారు తమ మజాలో మనిగిపోయారు. కానీ వెనుకగా వస్తున్న రైలు తమను కబళిస్తుందని గుర్తించలేకపోయారు. ఢిల్లీ సవిూపంలోని నంగ్లోయ్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ముకేశ్ వర్మ (50), సుశీల్ (25) అనే ఇద్దరిని గుర్తించారు. మూడో వ్యక్తి ఎవరో తెలియరాలేదు. ఓ వస్త్రాల తయారీ పరిశ్రమలో పనిచేసే వర్మ, సుశీల్ పట్టాల పక్కనే ఉన్న మంగోల్పురి ప్రేమ్నగర్ జేజే కాలనీలో నివాసముంటున్నారు. వారు అంతా 15 నిమిషాలు మాత్రమే పట్టాలపై గడిపారని, రైలు డ్రైవర్ చివరి నిమిషంలో బ్రేకు వేసినా ఫలితా లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.