పట్టాలు తప్పిన గూడ్స్‌

తెలంగాణ`ఏపీ మధ్య రైళ్లు నిలిపివేత
నల్లగొండ (జనంసాక్షి)
సికింద్రాబాద్‌-గుంటూరు మార్గంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ మార్గంలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనితో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడిరది. పలు రైళ్లను రైల్వే అధికారులు ముందు స్టేషన్లలోనే నిలిపివేశారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు.. విష్ణుపురం స్టేషన్‌ సమీపంలో ప్రయాణిస్తుండగా తొలుత ఒక బోగీ పట్టాలు తప్పింది. కాసేపటికే మరో బోగీ కూడా పక్కకు ఒరిగింది. అయితే రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉండటంతో.. ఆ సమయంలో గూడ్స్‌ రైలు కాస్త తక్కువ వేగంతో ప్రయాణిస్తోంది. దీనికితోడు బోగీలు పట్టాలు తప్పిన విషయాన్ని గమనించిన రైలు లోకో పైలట్‌ వెంటనే బ్రేకులు వేశారు. దీంతో మిగతా బోగీలు పట్టాలు తప్పలేదు. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో.. సికింద్రాబాద్‌-గుంటూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. పలు రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి. శబరి ఎక్స్‌ప్రెస్‌ ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో ఆపేశారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఏపీలోని పిడుగురాళ్లలో నిలిపివేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. పట్టాలు తప్పిన బోగీలను సరిచేసి.. రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.