పెట్టుబడులవేటలో కేటీఆర్
– ఢిల్లీలో బిజీబిజీ
న్యూఢిల్లీ,జులై 19(జనంసాక్షి): దేశరాజధాని ఢిల్లీలో మంత్రి కెటిఆర్ బిజీగా గడిపారు. వివిధ దేశాల ప్రతినిధులను కలసి తెలంగాణ పారిశ్రామిక విధానం,పెట్టుబడులపై చర్చించారు. విదేశీ రాయబారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని జపాన్ అంబాసిడర్కు వివరించానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో హార్డ్వేర్ కంపెనీలకు ఉన్న అవకాశాలపై విదేశీ రాయబారులతో చర్చించానని కేటీఆర్ అన్నారు. పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో జపాన్లో పర్యటిస్తానని కేటీఆర్ తెలిపారు. డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని సునీల్ మిట్టల్ను కోరానని కేటీఆర్ అన్నారు. మలేషియా ఉపప్రధానిని తెలంగాణకు రావాలని ఆహ్వానించామని కేటీఆర్ చెప్పారు. మోదీ తెలంగాణ పర్యటన తేదీలు త్వరలోనే ఖరారవుతాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చిన్న, మధ్య తరగతి పారిశ్రామికవేత్తల సమస్యలను కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రాతో చర్చిస్తానని కేటీఆర్ చెప్పారు.




