పద్మ పురస్కారాలు ఎలా వస్తాయో అందరికీ తెలుసు

– ప్రధాని మోదీ

దిల్లీ,ఆగష్టు 17(జనంసాక్షి): మన దేశంలో గతంలో పద్మ పురస్కారాలు ఎలా దక్కేవో అందరికీ తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం దిల్లీలో జరిగిన యువ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. పద్మ అవార్డులకు ఎంపిక చేసే విధానంలో తాము సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం పద్మ అవార్డుల కోసం ఏ వ్యక్తి అయినా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఎవరికీ తెలియని హీరోలు కూడా గుర్తింపు పొందుతున్నారని అన్నారు. ప్రతి పౌరుడు దేశం కోసం ఎంతోకొంత తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వంలో విధానాలు రూపకల్పన చేయగలిగే యువతతో నేడు సమావేశమయ్యానంటూ ఆయన వ్యాఖ్యానించారు. దేశం కోసం యువతతో పాటు సీనియర్లు కూడా కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు.