పన్ను ఎగవేతదారుల పనిపడతాం

– ఆర్థిక మంత్రి చిదంబరం
న్యూఢిల్లీ, మార్చి 3 (జనంసాక్షి) :
ఆదాయపు పన్ను ఎగవేతదారుల పని పడతామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం హెచ్చరించారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో కొందరు ఆదాయానికి తగినట్టుగా పన్ను చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా తమ శాఖ నుంచి త్వరలో మరిన్ని ప్రకటనలుంటాయని తెలిపారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో బీమా, పింఛన్‌ బిల్లులు ఆమోదం పొందుతాయని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ యేడాది నవంబర్‌ నుంచి మహిళా బ్యాంకు అందుబాటులోకి వస్తుందని, తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు.