పయ్యావులకు కేబినెట్‌ ¬దాపదవి

– ఏపీ పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేసిన చంద్రబాబు
– నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పయ్యావుల
అమరావతి, జులై24(జ‌నంసాక్షి) : పీఏసీ (పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ) ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఖరారయ్యారు. ఆయన్ను పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేస్తూ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ కమిటీలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం కసరత్తు చేస్తున్నారు. స్పీకర్‌ కార్యాలయం వివిధ కమిటీల్లో ప్రాతినిధ్యం కోసం అధికార, విపక్షాల నుంచి పేర్లను తీసుకుంటోంది. ఇక ప్రతిపక్షానికి దక్కే పీఏసీ (పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ) ఛైర్మన్‌ పదవికి పయ్యావుల పేరును చంద్రబాబు ఖరారు చేశారు. చంద్రబాబు పీఏసీ ఛైర్మన్‌ పదవి కోసం టీడీపీలో నేతలు పోటీపడ్డారు. అచ్చెన్నాయుడుతో పాటూ మరో ఐదారు పేర్లు తెరపైకి వచ్చాయి. అచ్చెన్నను పదవికి ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పయ్యావులను చంద్రబాబు ఎంపిక చేశారు. సీనియార్టీతో పాటూ అన్ని స్జబెక్ట్‌లపై కేశవ్‌కు అవగాహన ఉందని భావించారట. అందుకే ఆయన వైపు టీడీపీ అధినేత మొగ్గు చూపారనే పార్టీ వర్గాలు చెబుతున్నాయట. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ హయాంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా పనిచేశారు. పయ్యావుల కేశవ్‌ సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఓడి.. మళ్లీ 2004, 2009లో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో తిరిగి మళ్లీ గెలుపొందారు. 1999 మినహా మిగిలిన మూడుసార్లు ఆయన ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న ఆయనకు ఇన్నాళ్లకు కేబినెట్‌ ¬దా పదవి వరించింది.