పరిశ్రమలకు సెఫ్టీ ఆడిట్‌ ముఖ్యం

లేకుంటే చర్యలు తప్పవన్న మంత్రి అమర్నాథ్‌
అచ్యుతాపురం సెజ్‌ గ్యాస్‌ లీక్‌పై విచారణ
ప్రమాద కారణాలు తెలుసుకుంటున్నామని వెల్లడి
ఆస్పత్రిలో క్షతగాత్రులకుమంత్రి పరామర్శ

విశాఖపట్టణం,అగస్టు3(నం సాక్షి): అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై మంత్రి అమర్నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటసారి జరిగిన ప్రమాదంలో ఏసీ డెక్‌ లలో క్రిమిసంహారక మందులు కలవడం వల్ల జరిగినట్లు తేలిందన్నారు. ఆ ప్రమాదంలో గ్లోరిఫై పాలీస్‌ అనే రసాయనం వెలువడినట్టు తెలుసిందని, ఈ సారి ఏసీ డెక్‌ వల్ల జరిగిందా? క్రిమిసంహార మందులు వల్ల జరిగిందా? అని నిర్దారణ కావలసి వుందన్నారు. అలాగే ఇది యాదృచ్ఛికమా.. లేక ఉద్దేశ్య పూర్వకంగా జరిగిందా? అన్నది తేలాల్సి ఉందన్నారు. పరిశ్రమలకు సేప్టీ ఆడిట్‌ ముఖ్యమని, లేని పక్షంలో ఆయా కంపెనీలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అచ్యుతాపురం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తామని, గ్యాస్‌ లీకైన ప్రదేశంలో నమూనాలు లాబ్‌?కు పంపుతున్నామని మంత్రి అమర్నాథ్‌ స్పష్టం చేశారు.
అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లోని సీడ్స్‌ కర్మాగారంలో మంగళవారం మరోసారి గ్యాస్‌ లీకవడం ఆందోళన కలిగిస్తోంది. బి షిఫ్టులో కార్మికులు పనిచేస్తుండగా రాత్రి 7.30 గంటల సమయంలో ఘాటైన గ్యాస్‌ వాసన రావడంతో పలువురు మహిళలు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఇంకొందరు కళ్లు తిరిగి పడిపోయారు. మరికొందరి నోటి నుంచి నురగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్‌, అందుబాటులో ఉన్న వాహనాల్లో ఆస్పత్రులకు పంపారు. ఈ సంఘటనలో 200 మంది వరకు అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లలో హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సుమారు 100 మందికిపైగా బాధితులను అనకాపల్లికి తరలించారు. వీరిలో 56 మందిని ఎన్టీఆర్‌ ఏరియా ఆస్పత్రికి పంపారు. మరో 38 మందిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఎన్టీఆర్‌ ఆస్పత్రి వార్డులో పడకలు చాలకపోవడంతో కొంతమందిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్‌, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. విష వాయువు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి
వైద్యులను కలెక్టర్‌ ఆదేశించారు. అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో బాధితులను పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ పరామర్శించారు. సీడ్స్‌ కంపెనీ మూసేయాలని ఆదేశించినట్లు తెలిపారు.