పర్యాటక వసతి గృహం నిర్మాణం
విశాఖపట్నం,జూలై24(జనంసాక్షి): దేశవ్యాప్తంగా బౌద్దారామాల అభివృద్ధిలో భాగంగా భీమిలి వద్ద పర్యాటక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భీమిలి బీచ్రోడ్డు-వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్డులో గొల్లల తిమ్మాపురం బావికొండ ప్రవేశ మార్గం వద్ద ఈ పర్యాటక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బౌద్దారామాల అభివృద్ధిలో భాగంగా కేంద్రం మంజూరు చేసిన రూ. 2 కోట్ల స్వదేశీ దర్శన్ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. సందర్శకులు సేద తీరేందుకు అవసరమైన వసతి, సదుపాయాలు కల్పించనున్నారు. ధ్యానం, యోగా,పుస్తకశాల వంటివి ఏర్పాటు చేయనున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతారు. సందర్శకుల సంఖ్యను గణనీయంగా పెంచి ఈ బౌద్దారామానికి వన్నె తెచ్చేలా దీనిని నిర్మిస్తున్నట్లు పర్యాటకశాఖ డీఈ సత్యనారాయణ తెలిపారు.