పాకిస్థాన్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అఫ్రాఫ్‌ పర్యటనను బహిష్కరించిన అజ్మీర్‌ దర్గా గురువు

అజ్మీర్‌ : పాకిస్థాన్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అఫ్రాఫ్‌ నేడు భారత పర్యటనకు రానున్నారు. రాజస్థాన్‌లోని ప్రముఖ అజ్యీర్‌ దర్గా దర్శించుకోనున్నారు. మరోవైపు పాక్‌ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తునట్లు అజ్మీర్‌ దర్గా ఆధాత్మిక గురువు జైనుల్‌ అబేదిన్‌ తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు భారత సైనికులను పాక్‌ దారుణంగా చంపి వారి తలలను నరికిన ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పర్వేజ్‌కు స్వాగతం పలకడమంటే తలలు కోల్పోయిన భారత సైనికుల కుటుంబాలను అగౌరవపరచడమేనని ఆయన వ్యాఖ్యానించారు. సైనికుల తలలను భారత్‌కు పాక్‌ అప్పగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు ఇది పూర్తిగా పాక్‌ ప్రధాని ప్రైవేటు పర్యటన అని దీనిపై నేతలు, సంస్థలు రాజకీయం చేయవద్దని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ కోరారు. భారత పర్యటన సందర్భంగా పాక్‌ ప్రధానికి కేవలం విందు మాత్రమే ఇవ్వనున్నట్లు… ఎలాంటి చర్చలు చేపట్టడం లేదని ఆయన వివరణ ఇచ్చారు.