పాక్‌ సుప్రీంకోర్టుకు సైన్యం హెచ్చరిక

ఇస్లామాబాబాద్‌ : తమను తక్కువగా చూస్తే సహించేది లేదని పాక్‌ సైన్యం అక్కడి సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. తమకు పౌరులకు మధ్య అగాధం సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించింది. రాజకీయాలలో సైన్యం జోక్యం చేసుకోరాదనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇస్తికార్‌ చౌధురి గత నెల రూలింగ్‌ ఇచ్చారు. ఇది శక్తిమంతులైన పాక్‌ జనరల్స్‌కు మింగుడుపడలేదు. కోర్టుపై వారు మండిపడుతున్నారు. 65 ఏళ్ల పాక్‌ చరిత్రలో సగభాగం సైనికపాలన కిందే ఉంది. పలు కుట్రలు, తెర వెనుక భాగోతాలతో పాక్‌ సైన్యం అధికారం ఎన్నో పర్యాయాలు అధికారం హస్తగతం చేసుకుంది. తెలిసి చేసినా తెలియకచేసినా సైన్యానికి ప్రజలకు మధ్య అగాధం సృష్టిస్తే ఇది జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని పాక్‌ సర్వసైన్యాధిపతి జనరల్‌ ఇష్ఫాక్‌ కయాని చెప్పారు. కోర్టులను గాని న్యాయమూర్తులను గాని ఆయన నేరుగా ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు తీర్పుపైనే కయానీ వ్యాఖ్యలని పేరుచెప్పేందుకు ఇష్టపడని సైనికాధికారి ఒకరు చెప్పారు. సైన్యం అధ్వర్యంలో రాజకీయ సంకీర్ణాలు చోటుచేసుకుంటున్నానయని విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఇందుకు వ్యతిరేకంగా రూలింగ్‌ ఇచ్చింది. ఈ కేసులో విశ్రాంత జనరల్స్‌పై చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాని వీరిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు.