పాటియాల సుందరాంగికి మిస్ ఇండియా కిరీటం
హైదరాబాద్, మార్చి 25 (జనంసాక్షి) : 2013 సంవత్సరం మిస్ ఇండియాగా పాటియాలా నగరానికి చెందిన నవనీత్ కౌర్ థిల్లాన్ ఎంపికయ్యారు. మిస్ ఇండియా పోటీ ఆదివారం రాత్రి ముంబాయి ఆంధేరి ప్రాంతంలోని యశ్రాజ్ స్టూడియోలో జరిగింది. 1963 నుంచి ఈ మిస్ ఇండియా పోటీని నిర్వహిస్తున్న బెనెట్ అండ్ కోల్మన్ కంపెనీకి, ఈ ఏడాది పోటీ యాభయ్యవది కావడం విశేషం. విశాఖపట్నానికి చెందిన ధూళిపాళ శోభిత ఫస్ట్ రన్నరప్గానూ. లక్నోకు చెందిన జోయా అఫ్రోజ్ సెకండ్ రన్నరప్గాను ఎంపికయ్యారు. దేశవ్యాప్తం గా ఎంపిక చేసిన 23 మంది ఫైనలిస్టుల నుంచి ఈ ముగ్గురినీ ఎంపిక చేశారు. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్, క్రికెటర్ యువరాజ్సింగ్, ఫ్యాషన్ డిజైనర్ రీతూ కుమార్, బాలీవుడ్ నటీనటులు జాన్ అబ్రహామ్, ఆసిన్, చిత్రాంగద సింగ్లతో కూడిన ఎంపిక కమిటీ వీరిని ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్, ప్రియాంకచోప్రా, ఆఫ్తాబ్ శివదసాని, రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఒబెరాయ్ ఇచ్చిన ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.