పాలేరు టిఆర్‌ఎస్‌లో అసమ్మతి

ఎమ్మెల్యే తీరుపై కార్యకర్తల మండిపాటు

ఖమ్మం,నవంబర్‌19(జనం సాక్షి): పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డిపై నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అసమ్మతి గళం విప్పారు. ఉపేందర్‌ రెడ్డి గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తనతోపాటు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు కనీసం సభ్యత్వం కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్టీ సభ్యత్వం నమోదు వరకు ఎమ్మెల్యే ఉపేందర్‌ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ వస్తున్నారని, పార్టీ నాయకులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. తనకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఉపేందర్‌ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ను సర్వనాశనం చేస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులను పూర్తిగా పక్కకు పెట్టేశారని మండిపడుతున్నారు.