పాలేరు వాగులో చిక్కుకున్న కూలీలు క్షేమం

క్షేమంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

సూర్యాపేట,జూలై23(జనంసాక్షి): జిల్లాలోని పాలేరు వాగులో చిక్కుకున్న 23 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. మద్దిరాల మండలం ముకుందపురం`జీ.కొత్తపల్లి మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగులో చికుక్కుపోయిన వ్యవసాయ కూలీలను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
దీంతో 23 మంది కూలీలు పాలేరు వాగులో చిక్కుకున్నారు. వరద ఉధృతికి వాగు దాటడం కష్టంగా మారింది. సెల్ఫీ వీడియో తీసి వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు. దీంతో అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయంతో వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. వారంతా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం చౌళ్లతండాకు చెందినవారని పోలీసులు తెలిపారు.